
ఒక మనిషిని బతికించేంది గాలి, నీరు,నిద్ర, అన్నం, ఆకలేకాదు.. పగ పగ కూడా బతికిస్తుంది అంటూ ఓ పవర్ఫుల్ తెలుగు సినిమా డైలాగ్ ఉంది. అలాంటి పగతోనే ఏకంగా 50 ఏళ్లు రగిలిపోయిన ఓ వ్యక్తి.. తన తోటి స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు.
కేరళ కాసర్గాడ్లో 62 ఏళ్ల ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వాళ్లు చెప్పిన విషయం విని షాక్ తిన్నారు. ఎందుకంటే.. అది 50 ఏళ్ల కిందటి గొడవ ఫలితం అని.
నాలుగో తరగతి చదువుతున్నప్పుడు వీజే బాబు, బాలకృష్ణన్-మాథ్యూ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే టీచర్ల జోక్యంతో ఆ వివాదం అప్పుడే సమసిపోయింది. కానీ, బాలకృష్ణన్ అది మనసులో పెట్టుకుని యాభై ఏళ్లు గడిపారు. తాజాగా.. ఆ స్కూల్ విద్యార్థుల రీయూనియన్ జరిగింది. ఈ సందర్భంగా.. ఇద్దరూ కలుసుకున్నారు. అయితే బాలకృష్ణన్ పాత గొడవను మనసులో పెట్టుకుని మాథ్యూ సాయంతో వీజే బాబుపై దాడికి పాల్పడ్డాడు.
బాలకృష్ణన్ కాలర్ పట్టుకుంటే.. మాథ్యూ వీజే బాబు ముఖంపై పిడిగుద్దులు గుప్పించి, రాళ్లతో దాడికి పాల్పడ్డాడట. ప్రస్తుతం బాబు కన్నూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీజే బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.