యూరప్‌ దేశాలు ఇకనైనా మేలుకోవాలి: జైశంకర్‌

Jaishankar Says Ukraine Wakeup Call To Look At Problems In Asia - Sakshi

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

‘అఫ్గానిస్తాన్‌తోపాటు పలు ఆసియా దేశాల్లో పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్‌ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని మంగళవారం ‘రైజినా డైలాగ్‌’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్‌ విదేశాంగ మంత్రులు, స్వీడన్‌ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌ సంక్షోభం యూరప్‌ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు.

ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అఫ్గానిస్తాన్‌ పరిణామాలు, కోవిడ్‌ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు.   

ఇది చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top