పిట్‌బుల్‌ బీభత్సం.. పరారీలో కుక్క యజమాని | Hubbali: Deadly attack of a pit Bull on a Student | Sakshi
Sakshi News home page

పిట్‌బుల్‌ బీభత్సం.. పరారీలో కుక్క యజమాని

Nov 30 2022 9:23 AM | Updated on Nov 30 2022 10:24 AM

Hubbali: Deadly attack of a pit Bull on a Student - Sakshi

సాక్షి, బెంగళూరు: మనదేశంలో నిషేధించిన పిట్‌బుల్‌ జాతి కుక్క బాలునిపై పడి కరిచింది. టూషన్‌కు వెళుతున్న విద్యార్థిని కరవడంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. హుబ్లీ బంకాపుర చౌక్‌ వద్ద పాటిల్‌ గల్లీలో జరిగిన ఘటనలో పవన్‌ అనిల్‌ దొడ్డమని (12) అనే బాలునికి తీవ్రగాయాలు అయ్యాయి.  గురుసిద్దప్ప చెన్నోజీ అనే వ్యక్తికి చెందిన కుక్క కాంపౌండ్‌ నుంచి ఎగిరి వచ్చి బాలుని మీద దాడి చేసిందని బెణ్ణిగేరి పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటనతో సదరు కుక్క యజమాని కుక్కను తీసుకుని కుటుంబంతో సహా ఇళ్లు విడిచి పరారయ్యాడు. ఇతడు మాజీ కార్పొరేటర్‌ బంధువు అని చెబుతున్నారు. పిట్‌బుల్‌ జాతి కుక్కలు ఉద్రేకమైనవని, ఉట్టి పుణ్యానికే జనం మీద పడి కరుస్తాయని పేరుంది. దీంతో భారత ప్రభుత్వం వీటి పెంపకాన్ని నిషేధించింది. అయినప్పటికీ కొందరు దొంగచాటుగా వీటిని పెంచుకోవడం జరుగుతోంది. అమెరికా వంటి విదేశాల నుంచి ఈ కుక్కలను గతంలో దిగుమతి చేసుకున్నారు.  

జంట నగరాల్లో కుక్కల గోల  
కాగా హుబ్లీ–ధార్వాడ జంట నగరాలలో కుక్కల బెడద ఎక్కువైంది. కిమ్స్‌ ఆస్పత్రిలో నమోదవుతున్న కేసులే దీనికి రుజువు. ఈ మధ్యకాలంలో కుక్కలు కొరికి వ్యాక్సిన్‌ వేసుకున్న వారు 750 మంది వరకూ ఉన్నారు. ఈ కేసులన్నీ హుబ్లీ నగరానికే చెందినవి. నిత్యం ఐదారు మందికి పైగా కుక్కల బారినపడి కిమ్స్‌కు వస్తున్నారు. 

ముఖ్యంగా హుబ్లీలోని బంకాపుర చౌక్‌ సెటిల్‌మెంట్‌ ప్రదేశం, పాతహుబ్లీ, గణేష్‌ పేట, ఆనంద్‌నగర, తదితర చోట్ల వీధి శునకాల బెడద అధికంగా ఉంది. కొప్పికర్‌ రోడ్డు ఇటీవల యువకులపై కుక్క దాడి చేసింది. ఆ వెనువెంటనే బంకాపుర్‌ చౌక్‌ పాటిల్‌ గల్లీలో మరో ఘటన జరిగింది.  

చదవండి: (అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు)

త్వరలో నియంత్రణ చర్యలు  
కార్పొరేషన్‌ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌.శ్రీధర్‌ దండెప్పనవర మాట్లాడుతూ కుక్కల నియంత్రణకు కృషి చేస్తున్నాము. ఆ మేరకు టెండర్లును పిలిచాము. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకొని సంతాన రహిత ఆపరేషన్లను చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement