జీ-20 ఎఫెక్ట్: ఈ తేదీల్లో పలు మెట్రో స్టేషన్లు రద్దు | G20 Summit These Delhi Metro Stations To Remain Closed | Sakshi
Sakshi News home page

జీ-20 ఎఫెక్ట్: ఈ తేదీల్లో పలు మెట్రో స్టేషన్లు రద్దు

Sep 4 2023 12:30 PM | Updated on Sep 4 2023 1:30 PM

G20 Summit These Delhi Metro Stations To Remain Closed - Sakshi

ఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ముస్తాబవుతోంది. సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఢిల్లీ మెట్రోపై ఆంక్షలను విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్‌లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. 

దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్‌లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. 

ఢిల్లీలోని మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్‌లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు.

ఢిల్లీలో మిగిలిన స్టేషన్లు సాధారణంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 4-13 వరకు స్మార్ట్ కార్డ్ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ సేవలు ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్‌ ఏమన్నారంటే

   

Advertisement
 
Advertisement
Advertisement