సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్.. కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు అలవాటే అని డీఎంకే యువజన సమావేశంలో తీర్మానం చేశారు. ఇతరుల శ్రోమను దోచుకుని ద్రోహం చేయడం కాంగ్రెస్కు పరిపాటేనని శివాలెత్తారు.
కాగా, అన్నా అరివాలయంలో డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చాలాకాలం తర్వాత యువజన సమావేశానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తాజాగా హాజరు కావడం విశేషం. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, ఓటమికి గల కారణాలు, జిల్లాలలో నెలకొన్న పరిస్థితులు, యువతకు పెద్ద పీట వేసే విధంగా మున్ముందు చేపట్టనున్న అంశాలగురించి ఇందులో చర్చించారు.
అలాగే, యువత సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా విస్తృతం చేయాలని ఈ సందర్భంగా స్టాలిన్ పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. అలాగే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సైతం నినాదాలు చేశారు. ఇందులో ప్రధాన తీర్మానంగా వెన్నుపోటు కాంగ్రెస్కు ఖండన అని నిరసనను వ్యక్తం చేశారు. ఇతరుల శ్రమను దోచుకుని, చివరకు ద్రోహం చేయడం కాంగ్రెస్కు అలవాటేనని మండి పడ్డారు. డీఎంకేకు కాంగ్రెస్ తీవ్ర ద్రోహం చేసిందని, ఆ పార్టీని ఎట్టి పరిస్థితులలోనూ క్షమించ వద్దు అని పార్టీ అధిష్టానానికి యువజన సమావేశం విన్నవించింది. ప్రయాణించే పడవకే చిల్లు పెట్టే మేధావులు కాంగ్రెస్ వాదులు అని హేళన చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


