రాంచీ: జార్ఖండ్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో విచిత్రంగా ప్రవర్తించాడు. పూటుగా తాగాడు.. అనంతరం అక్కడికి ప్రాకుతూ వచ్చిన పామును తిన్నాడు.. అంతటితో ఆగకుండా అక్కడే చంపి ఉన్న మరో పామును కొరికి మింగాడు.. దీంతో పరిస్తితి విషమించడంతో అతని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఏం జరిగిందంటే?
స్థానికుల కథనం ప్రకారం... (శనివారం )కుందా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వాదిహ్ తోలా గ్రామంలో బుధన్ భారతి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ, పేకాట ఆడుతున్నాడు. ఆ సమయంలో సమీపంలోని పొలం నుండి ఒక పాము అతని వైపునకు పాకుతూ వచ్చి, కరవడానికి ప్రయత్నించింది.దీంతో అక్కడున్న వారంతా పరారయ్యారు. అయితే బుధన్ భారతి మాత్రం అక్కడున్న వారు ఎంత వారించినా వినకుండా, ఆ పామును చేతులతో పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆ పామును ప్రాణంతో ఉండగానే కొరికి తినేశాడు.
అక్కడితో అతని కిక్కు దిగలేదు.. మొదటి పామును తిన్న తర్వాత, బుధన్ పక్కనే ఉన్న పొలానికి పరిగెత్తాడు. అక్కడ గ్రామస్థులు అంతకుముందే కొట్టి చంపిన మరో పామును కూడా తీసుకెళ్లి తినేసాడు. ఇంతటితో ఆగకుండా రెండు పాములను తిన్న తర్వాత కూడా బుధన్ మళ్లీ మద్యం తాగుతూనే ఉన్నాడు. అంతలో అక్కడికి మరో మూడో పాము రాగా, దాన్ని కూడా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు అతడిని ఎలాగోలా అడ్డుకున్నారు.
ఈ వింత ఘటన జరిగిన కొద్దిసేపటికే బుధన్ ఆరోగ్యం క్షీణించింది. అతని శరీరం తెల్లగామారడం ప్రారంభమైంది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రతాప్పూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స అందుతోంది. అయితే అతడు తిన్న పాములు ఏవి అనేవి తెలియలేదు.


