ఢిల్లీ: పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. డీ లిమిటేషన్ పై తమ విధానంలో పునరాలోచన దిశగా డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, తమ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదని డీఎంకె వర్గాలు అంటున్నాయి.
డీఎంకే నేతలతో అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వాజ్పేయీ మంత్రివర్గంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ గుడ్బై చెప్పడంతో పరిణామాలు మారాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది.
డీఎంకే, టీఎంసీ పార్టీలకు లోక్ సభలో 50 మంది ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 50 శాతం లోక్ సభ, 50 శాతం అసెంబ్లీ సీట్లు పెంచేలా డీ లిమిటేషన్ బిల్లును రూపొందించారు. గత ప్రత్యేక సమావేశాల్లో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. జమిలి ఎన్నికల బిల్లును కూడా వీలైనంత త్వరగా ప్రవేశపెట్టి యోచనలో ప్రభుత్వం ఉంది. వర్షాకాల సమావేశాల తొలి వారంలో జేపీసీ నివేదికను వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ప్రవేశపెట్టనుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు ఉన్నాయి


