ఢిల్లీలో కలవరపెడుతున్న కరోనా.. పెరిగిన పాజిటివిటీ రేటు | Delhi Records Fresh Corona Cases And Positivity Rate Increased | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కలవరపెడుతున్న కరోనా.. పెరిగిన పాజిటివిటీ రేటు

Apr 16 2022 1:09 PM | Updated on Apr 16 2022 1:13 PM

Delhi Records Fresh Corona Cases And Positivity Rate Increased - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా కేసుల పెరుగుదల నమోదవుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. శనివారం కరోనా పాజిటివిటీ రేటు 4 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో​ మరణాల సంఖ్య సున్నా. మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,158గా ఉంది.

మరోవైపు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో భారత్‌లో 975 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అదే విధంగా 796 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. దేశంలో 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మరో 175 పెరగడం గమనార్హం. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే.. నిపుణులు అంచనా ప్రకారం మరో వేవ్ కూడా వస్తుందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. అయితే ఇప్పటివరకు దేశంలో సుమారు 180 కోట్ల డోసుల వాక్సిన్‌ను ప్రజలకు అందించినట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement