ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. టేకాఫ్‌కు ముందు క్షణాల్లో..

Bengaluru Indigo Flight Caught Fire On Runway Delhi - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో మంటలు చెలరేగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయెల్దేరినప్పుడు శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇంజిన్‌ నుంచి మంటలు రావడం చూసి విమానంలోని వారంతా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే ఫ్లయిట్‌ను అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు.

శుక్రవారం రాత్రి 9:45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రన్‌వేపై మరో ఐదారు సెకన్లలో ఫ్లయిట్ టేకాఫ్ అవుతుందనగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఘటన సమయంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. అయితే తాము 11 గంటల వరకు కిందకు దిగలేదని, విమానంలోని సిబ్బంది తమకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. ఇండిగో సంస్థ అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయాణికులందరినీ మరో విమానంలో బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది.

ఇండిగో విమానాల్లో ఇప్పటికే పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేషన్ విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టింది.
చదవండి: ఎలాన్ మస్క్‌కు షాక్‌.. ట్విట్టర్‌లో యాడ్స్ బంద్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top