
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000కి పైగా క్రియాశీలక కేసులున్నాయి. గత వారం రోజుల్లోనే 750 మంది కరోనా బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా కొత్త కేసులు పెరిగినట్టు తెలిపింది. కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కేరళలో 335 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 430కి పెరిగింది. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 209కు, ఢిల్లీలో 104కు పెరిగింది. గుజరాత్లో 83 కేసులు, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 12 కేసులు నమోదయ్యాయి. అయితే కేసుల పెరుగుదలతో భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.
చాలా కేసుల్లో బాధితులు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. అధిక కేసుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాపిడ్ రెస్పాన్స్ బృందంతో సమావేశం నిర్వహించింది. వ్యాధి తీవ్రత లేకున్నా అందరూ వ్యక్తిగత రక్షణ పాటించాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. ఎలాంటి పరిస్థితికైనా ఢిల్లీ ఆసుపత్రులు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు.