Coronavirus New Variant XE Detected Gujarat, Govt Sources Says - Sakshi
Sakshi News home page

Covid-19: గుజరాత్‌లో కొత్తవేరియెంట్‌ ఎక్స్‌ఈ కేసు గుర్తింపు!

Apr 9 2022 10:22 AM | Updated on Apr 9 2022 1:27 PM

Corona Virus New Variant XE Detected Gujarat - Sakshi

ముంబై భయాల నడుమ.. గుజరాత్‌లో కరోనా కొత్త వేరియెంట్‌ ఎక్స్‌ఈ నమోదు అయ్యింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌లో అత్యంత వేగవంతంగా వ్యాపించే ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియెంట్‌ కేసు గుజరాత్‌లో నమోదు అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సైతం నిర్ధారించినట్లు తెలుస్తోంది. 

గుజరాత్‌లో మార్చి 13న కరోనా బారిన పడ్డ సదరు పేషెంట్‌.. వారం తర్వాత కోలుకున్నాడు. అయితే శాంపిల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో సదరు పేషెంట్‌ ఎక్స్‌ఈ సబ్‌ వేరియెంట్‌ బారినపడినట్లు తెలుస్తోంది. అతని వివరాలు, ట్రావెల్‌ హిస్టరీ తదితర వివరాలను వెల్లడించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. 

ఇదిలా ఉండగా.. దేశంలో ముంబైలో తొలి ఎక్స్‌ఈ కేసు నమోదు అయ్యిందని అధికారుల ప్రకటన హడలెత్తించింది. అయితే కేంద్రం మాత్రం ఆ ప్రకటనను ఖండించింది. ఒమిక్రాన్‌లో బీఏ-2 అత్యంత వేగంగా వ్యాపించే వేరియెంట్‌గా గుర్తింపు ఉండేది. ఈ జనవరిలో యూకేలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ ఎక్స్‌ఈను.. ఒమిక్రాన్‌ బీఏ-2 కన్నా పది రెట్లు వేగంగా వ్యాపించే వేరియెంట్‌గా గుర్తించారు.

ఇది అంత ప్రమాదకరమైంది ఏం కాదని, కాకపోతే వేగంగా వ్యాపించే గుణం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరించారు. మరోవైపు దేశంలో 18 ఏళ్లు పైబడినవాళ్లకు మూడో డోసు(ప్రికాషన్‌) వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం.

Advertisement
 
Advertisement
Advertisement