ఏక్‌నాథ్‌ షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్‌ కునాల్‌కు బిగ్‌ షాక్‌ | CM Devendra Fadnavis Says Kunal Kamra should apologise To Shinde | Sakshi
Sakshi News home page

ఏక్‌నాథ్‌ షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్‌ కునాల్‌కు బిగ్‌ షాక్‌

Mar 24 2025 11:51 AM | Updated on Mar 24 2025 12:12 PM

CM Devendra Fadnavis Says Kunal Kamra should apologise To Shinde

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు.. శివసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కమెడియన్‌ కమ్రాపై కేసు నమోదు చేశారు. క్రమాపై వ్యాఖ్యలను సీఎం ఫడ్నవీస్‌, మరో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తప్పుబట్టారు.

ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందిస్తూ..‘కునాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏకానాథ్‌ షిండేపై చేసిన వ్యాఖ్యలకు గాను కునాల్‌ కమ్రా క్షమాపణలు చెప్పాల్సిందే. నేను కామెడీకి వ్యతిరేకంగా కాదు.. కానీ, కామెడీ పేరుతో ఒకరిని అగౌరవ పరచడం సరికాదు. డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సింది కాదు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. అలా అని మీరు ఇతరుల స్వేచ్చను భంగపరచకూడదు. దానికి పరిమితులు ఉన్నాయి. అలా మాట్లాడి మీ తప్పును మీరు సమర్థించుకోలేరు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

మరోవైపు.. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ..‘రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి మాట్లాడాలి. చట్టం పరిధి దాటి వ్యవహరించకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేను ఉద్దేశిస్తూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖార్‌ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ క్లబ్‌లో కునాల్‌ కమ్రా (Kunal Kamra) షో జరిగింది. ఇందులో కుమ్రా.. డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్‌ వేశారు. ‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో, కమెడియన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివసేన కార్యకర్తలు.. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. హోటల్‌లోని ఫర్నీచర్‌ు ధ్వంసం చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement