పథకం ప్రకారమే గల్వాన్‌ ఘర్షణలు | China planned Galwan Valley incident says US report | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే గల్వాన్‌ ఘర్షణలు

Dec 3 2020 5:12 AM | Updated on Dec 3 2020 5:51 AM

China planned Galwan Valley incident says US report - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత జూన్‌లో భారత్‌కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్‌ ఘర్షణల్ని డ్రాగన్‌ దేశం పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా–చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.

భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించింది. లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ), భారత సైనికుల మ««ధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే, చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్‌ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు. చైనా ఒక పథకం ప్రకారమే సరిహద్దుల్లో భారత్‌తో కయ్యానికి కాలు దువ్విందని ఆ నివేదిక స్పష్టం చేసింది.   

వారాల ముందు నుంచే...  
గల్వాన్‌ ఘర్షణలకు కొద్ది వారాల ముందే చైనా రక్షణ మంత్రి తమ సైన్యం  సరిహద్దుల్లో ఘర్షణలకు దిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే  చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌.. అమెరికా, చైనా మధ్య జరిగే పోరులో  భారత్‌ కల్పించుకుంటే చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాలు తెగిపోతాయని హెచ్చరించింది. ఘర్షణకు ముందే చైనా ఆర్మీకి చెందిన వెయ్యి మంది సైనికులు గల్వాన్‌ లోయను చుట్టుముట్టడం శాటిలైట్‌ ఇమేజ్‌లో కనిపించింది. భారీగా ఆయు«ధాల మోహరింపు దృశ్యాలు కూడా ఆ చిత్రాల్లో కనిపించాయని ఆ నివేదిక ప్రస్తావించింది.

Advertisement
 
Advertisement
Advertisement