ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఎం రేవంత్కు వ్యతిరేకంగా పోస్టలు పెట్టారనే ఆరోపణలపై నల్లబాలుపై నమోదు చేసిన మూడు కేసులను హైకోర్టు కొట్టివేయగా, దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు
అసలు ఏం జరిగిందంటే.. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలుపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. వాటిని తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
దీనిపై ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 2వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆ కేసులో హైకోర్టుఇచ్చిన తీర్పును అభినందించింది. మార్గదర్శకాలను ఇవ్వడంలో తప్పులేదంటూ పేర్కొంది ధర్మాసనం. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు.


