బిహార్‌లో 54.64% పోలింగ్‌ | Bihar Second Phase Polling In 54 Voting Percentage | Sakshi
Sakshi News home page

బిహార్‌లో 54.64% పోలింగ్‌

Nov 4 2020 1:30 AM | Updated on Nov 4 2020 1:30 AM

Bihar Second Phase Polling In 54 Voting Percentage - Sakshi

పట్నాలో ఓటేశాక సిరా గుర్తుతో సీఎం నితీశ్‌ 

పట్నా/భోపాల్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇందులో 54.64 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పింది. రెండు దశల్లో కలిపి 53.79 ఓటింగ్‌ శాతానికి పైగా నమోదైనట్లు తెలిపింది. మంగళవారం జరిగిన ఈ పోలింగ్‌లో దాదాపు 2.85 కోట్ల ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్‌ ఫగు చౌహాన్, సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్‌  మోదీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 జిల్లాల్లో 94 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్‌ కమిషన్‌ ఓటర్‌ టర్నౌట్‌ యాప్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ముజఫర్‌çపూర్‌లో అత్యధికంగా 54.89 శాతం ఓట్లు పోలయ్యాయి.

నితీశ్‌పై ఉల్లిపాయలు.. 
హార్లఖి నియోజకవర్గంలో ప్రచారసభలో సీఎం నితీశ్‌ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు పెరిగిన ఉల్లి ధరలపై నిరసనగా ఆయనపై ఉల్లిపాయలు విసిరారు. అయితే అవి నితీశ్‌పైకి రాకముందే నేలపై పడ్డాయి. భద్రతా బలగాలు వారిని పట్టుకోబోతుండగా నితీశ్‌ వారించారు.  

మధ్యప్రదేశ్‌లో 69.93 శాతం పోలింగ్‌.. 
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లో పలు ఉద్రిక్తత ఘటనల నడుమ కొనసాగిన∙అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌లో 69.93 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం 28 స్థానాల్లో పోలింగ్‌ పూర్తయింది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో కొందరు తుపాకులను ఉపయోగించడంతో, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 81.26 శాతం ఓటింగ్‌  నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 77, గుజరాత్‌లో 58.58, హరియాణాలో 69.43, జార్ఖండ్‌లో 62.51, ఒడిశాలో 70, నాగాలాండ్‌లో 84.41, ఉత్తరప్రదేశ్‌లో 53 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement