
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్పై మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ విమర్శలు గుప్పించారు. వినేశ్ ఫోగట్ రెజ్లింగ్ కెరీర్ కాపాడుకోవడానికి తన తండ్రి మహవీర్ ఫోగట్ ఎంతో పోరాటం చేశారని అన్నారామె. కానీ ఈ విషయంలో ఆయనకు వినేశ్ ఫోగట్ కృతజ్ఞతలు తెలపలేదని ఆరోపించారు. బబితా ఫోగట్ ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్యారిస్ ఒలింపిక్స్లో వినేశ్.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. అనంతరం వినేశ్ తన కోచ్లు, ఫిజియోలు, ఇతర సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆమె మొదటి కోచ్ అయిన మహావీర్ ఫోగట్ కృతజ్ఞతలు తెలపలేదు. నేను ఇప్పటివరకు మా నాన్న ఏడ్చిన సందర్భాలను కేవలం మూడు చూశాను.
మా అక్కలు వివాహం చేసుకున్న సమయంలో, మా పెద్దనాన్న మరణించిన సమయంలో, ప్యారిస్ ఒలింపిక్స్లో వినేశ్ ఫోగట్ అనర్హత గురైన సమయంలో ఆయన ఏడ్చారు. మా పెద్దనాన్న మరణించిన సమయంలో వినేశ్ రెజ్లింగ్ మానేస్తే.. ఇంటివెళ్లి మరీ రెజ్లింగ్ ప్రాక్టిస్ చేయాలని ప్రోత్సహించారు. అంతలా మా నాన్న వినేశ్ కోసం కష్టపడ్డారు. కానీ ఆమె తన మొదటి గురువును వదిలేసి.. మిగతావారికి కృతజ్ఞతలు తెలిపారు’’ అని అన్నారు.
ఇక.. ఇటీవల వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.