ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.20లక్షల నగల్ని..
చెన్నై : ఆటోలో పోగొట్టుకున్న 50 సవర్ల నగలను తిరిగి సొంతదారునికి అప్పగించి తన నిజాయితీని ఆటో డ్రైవర్ చాటుకున్నాడు. ఈ ఘటన చెన్నై, క్రోంపేట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. క్రోంపేటకు చెందిన ఆల్బ్రైట్ వ్యాపారుల సంఘం నేత. ఇతని కుమార్తెకు గురువారం ఉదయం అదే ప్రాంతంలో వున్న చర్చిలో వివాహం జరుగనుంది. దీ నిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం రిసెప్షన్ జరుగనుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చర్చి నుంచి ఆటోలో ఆల్బ్రైట్ ఇంటికి వెళ్లాడు. రూ. 20 లక్షల రూపాయలు విలువ చేసే 50 సవర్ల నగల సంచిని ఆటోలో పెట్టి మరిచి దిగి వెళ్లిపోయారు.
ఇంటికి వెళ్లిన తరువాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్బ్రైట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆటోలో నగల సంచి ఉండడం గమనించిన ఆటో డ్రైవర్ శరవణకుమార్ (30) ఆ నగలను తీసుకుని క్రోంపేట పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. నగలను పోలీసు లు సరి చూసి ఆల్బ్రైట్ నిర్ధారణ చేసిన తరువాత అతని చేతికి అందించారు. 50 సవర్ల నగలు తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్న శరవణ కుమార్కు పోలీసులు అభినందించారు.