అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపిన ఆటోడ్రైవర్
భీమవరం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి (32) దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతవాణి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఆమె తాడేరులో ఉంటోంది. మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్యాంబాబుతో ఆమెకు ఐదేళ్ల క్రితం పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారి వారిమధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతోంది.
శ్యాంబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటోంది. కాగా.. ఆరు నెలలుగా శ్యాంబాబును అనంతవాణి దూరం పెడుతూ వస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న శ్యాంబాబు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తాడేరులోని ఆమె ఇంటికి వెళ్లి కత్తితో అనంతవాణిపై దాడి చేశాడు. ఛాతీ, కడుపుపై పొడిచి పరారయ్యాడు. తండ్రి వెంకటేశ్వరరావు స్థానికుల సాయంతో అనంతవాణిని భీమవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.


