చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చెన్నైలోని ప్రభుత్వ చిన్నారుల ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో ‘నిర్లక్ష్యం’పై వేటు వేయాలని ఆదేశించిన ఆయన.. చిన్నారులతో సరదాగా గడిపారు.
ఇటీవల ఆస్పత్రిలో సౌకర్యాల లోపాలు, సిబ్బంది వ్యవహారశైలిపై ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సీఎంవో నుంచి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా ఆస్పత్రికి చేరుకున్న విజయ్.. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. చికిత్సా విధానం, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఆస్పత్రిలోని వార్డులు, ఇతర సదుపాయాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎం ఆకస్మిక రాకతో ఆస్పత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలపై అధికారులను ప్రశ్నించిన విజయ్.. లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. వైరల్ అయిన ఓ వీడియో ఆధారంగా సంబంధిత అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆయన ఆదేశించారు.
విజయ్ అన్నా..
కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఆస్పత్రి పరిస్థితులపై సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది. సీఎం విజయ్ను అన్నా.. అని సంబోధిస్తూ.. తాను పేద కుటుంబానికి చెందిన మహిళనని పేర్కొంటూ.. ఆస్పత్రి సిబ్బంది లంచాలు అడుగుతున్నారని, రోగులకు ఆహారం సకాలంలో అందడం లేదని, కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని ఆరోపించింది. అయితే..
విజయ్ ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ (Ma Subramanian) మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మరిన్ని మరుగుదొడ్లు, అదనపు వార్డులు, క్యాంటీన్ అవసరం ఉందని రోగులు, సందర్శకుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా గుర్తించామని చెప్పారు. ఆస్పత్రి మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
The Humbleness he has 🤌🤌#Vijay #TVKVijay pic.twitter.com/h9F8R3fbrv
— Think_Big (@okate_brathuku) July 8, 2026
సీఎం రాకతో ఆస్పత్రి వద్ద సందడి
విజయ్ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లు పెంచాల్సి వచ్చింది. కొంతసేపు ఆస్పత్రి పరిసరాల్లో సందడి నెలకొంది.
స్వయంగా స్పందించింది అందుకేనా?
సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. యువతతో పాటు మహిళలు, చిన్నారుల్లో ఆయనకు మంచి ఆదరణ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వర్గాల మద్దతే ఆయన పార్టీ తమిళగ వెట్రి కగళం ఎన్నికల ప్రస్థానంలో కీలకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని విజయ్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా తన ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ తనిఖీని చూస్తున్నారు.
ఇటు విజయ్ ఆకస్మిక తనిఖీతో పాటు ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవడం అధికార యంత్రాంగంలోనూ చర్చకు దారితీసింది. సీఎం ఎప్పుడైనా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టే అవకాశం ఉందన్న సంకేతాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్లక్ష్యం, లోపాలపై ఇకపై మరింత కఠిన చర్యలు తప్పవన్న భావన అధికార వర్గాల్లో నెలకొంది.


