గువాహటి: వృక్షో రక్షతి రక్షితః అనే ప్రాచీన సూక్తిని మనసా వాచా కర్మణా నమ్మిన అస్సాం వనితలు తాము అనుకున్నది చేసి చూపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో మొక్కలను నాటి కొత్త రికార్డ్ను సృష్టించారు. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘అస్సాంలోని స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీ) సభ్యులైన మహిళలకు పర్యావరణంపై మక్కువ చాలా ఎక్కువ.
అందుకే శుక్రవారం కేవలం 8 గంటల వ్యవధిలో 1.02 కోట్ల మొక్కలను నాటారు. భూతాపోన్నతి నుంచి ధరిత్రిని కాపాడుకునేందుకు ధీర వనితలు నడుం బిగించి ముందుకు కదిలారు. నారీశక్తిని నిరూపించారు. ఈ ఘనత సాధించిన సోదరీమణులందరికీ నా అభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న మా పిలుపునకు వచ్చిన స్పందన అపూర్వం. అద్భుతం.
స్వయంసహాయక సంఘాల సభ్యులతోపాటు ప్రజలు సైతం తమ వంతుగా మొక్కలు నాటి తమలోని పర్యావరణ స్పృహను చాటారు’’అని సీఎం హిమంత పొగడ్తల వర్షం కురిపించారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సైతం గువాహటిలోని జ్యోతిబిష్ణు అంతర్జాతీయ కళామందిర ప్రాంగణంలో మొక్క నాటారు. శుక్రవారం అదే వేదికపై 12 మంది నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశాక అక్కడి ప్రాంగణంలో ముఖ్యమంత్రి సైతం ఒక మొక్క నాటారు.


