
న్యూఢిల్లీ: ఉరి, పుల్వామాలలో జరిగిన దాడుల కంటే.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam)లో తాజాగా జరిగిన ఉగ్ర దాడి అత్యంత ఘోరమైందని, అది తనను ఎంతగానో బాధించిందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న ఆయన.. ఘటనకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
‘‘పహల్గాంలో.. మతం ఏంటని అడిగిన తర్వాతే ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఇది గతంలో జరిగిన ఉరి, పుల్వామా ఉగ్రదాడుల కంటే ఘోరమైంది. ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. ఇది కచ్చితంగా నిఘా వ్యవస్థ వైఫల్యమే. జమ్ములో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరోధక విధానం పనిచేస్తుందో లేదో పరిశీలించుకోవాలి. ఈ ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆశిస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారాయన.
దక్షిణ జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఘోరం జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. మైదానంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న పర్యాటకులను చుట్టుముట్టి తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. ఐడీ కార్డులను పరిశీలించి.. పేరు, మతం ఆధారంగా వేరు చేసి మరీ దాడి చేశారు.
ఈ దాడిలో 26 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడి మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరు తాజాగా మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. అయితే.. బాడీ కేమ్ ద్వారా దాడి దృశ్యాలను పాక్లోని తమ హ్యాండర్లకు ఉగ్రవాదులు చేరవేసినట్లు భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఫొటోలు, ఊహా చిత్రాలు విడుదల చేసి.. జమ్ము వ్యాప్తంగా గాలింపు కొనసాగిస్తోంది.
