
మొదటి దశలో మూడింటి అప్పగింత
న్యూఢిల్లీ: భారత సైన్యం అమ్ములపొదిలోకి అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ ఏహెచ్–64ఈ అటాక్ హెలికాప్టర్లు చేరనున్నాయి. ఈ నెల 22న అవి సైన్యానికి అందబోతున్నాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే 15 నెలలు ఆలస్యమైంది. మొదటి దశ హెలికాప్టర్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. మొదట మూడు హెలికాప్టర్లను మంగళవారం ఇండియన్ ఆర్మ్ కి చెందిన ఏవియేషన్ విభాగానికి అప్పగించబోతున్నారు.
మొత్తం ఆరు హెలికాప్టర్ల కొనుగోలుకు 2020లో అమెరికాతో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ 600 మిలియన్ డాలర్లు(రూ.5,171 కోట్లు). 2024 జూన్ నెలలో మొదటి దశ హెలికాప్టర్లను అప్పగించాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. మొదటి దశ హెలికాప్టర్లు మంగళవారం రానుండగా, రెండో దశ హెలికాప్టర్లు ఈ ఏడాది ఆఖరు నాటికి రాబోతున్నాయి.
అపాచీ ఏహెచ్–64ఈ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో కీలకం కాబోతున్నాయి. ఇవి శక్తివంతమైనవిగా పేరొందాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో వీటిని మోహరించబోతున్నారు. 2015లో కుదిరిన మరో ఒప్పందం కింద భారత సైన్యం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను సమకూర్చుకుంది. ఏహెచ్–64ఈ అటాక్ హెలికాప్టర్లు వాటి కంటే అత్యాధునికం అని చెబుతున్నారు.