
బెదిరింపుల నేపథ్యంలో అదనపు హైటెక్ భద్రత
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఆగ్రా (యూపీ): తాజ్మహల్ను పేల్చేస్తామని వరుస బెదిరింపుల నేపథ్యంలో.. ఈ అద్భుత నిర్మాణం భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. తాజ్ మహల్ కాంప్లెక్స్లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీంతో తాజ్ మహల్ భద్రత మరింత హైటెక్గా మారనుంది. ఈ స్మారక చిహ్నం ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), ఉత్తరప్రదేశ్ పోలీసుల రక్షణలో ఉంది. ఇక్కడ త్వరలో అధునాతన డ్రోన్ తటస్థీకరణ సాంకేతికత రూపంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నామని తాజ్ సెక్యూరిటీ ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ తెలిపారు.
ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేయగలుగుతుంది. ప్రధాన గోపురంపైన 200 మీటర్ల వ్యాసార్థంలో ప్రభావవంతంగా పనిచేయనుంది. ఆ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే వెంటనే గుర్తించి దాని సిగ్నల్ను జామ్ చేస్తుంది. దీంతో డ్రోన్ పనిచేయదు. దీనిని ‘సాఫ్ట్ కిల్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థను నిర్వహించడానికి పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, అంకితమైన ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని అరిబ్ అహ్మద్ తెలిపారు.
కొద్ది రోజుల్లో వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేయడం తెలిసిందే. అయితే.. ఆ తరువాత పాక్ వరుసగా ఫిరంగి, క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపైనా దాడికి యత్నించింది. వీటన్నింటి భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలలో డ్రోన్ నిరోధక చర్యల అవసరాన్ని గుర్తించిన కేంద్రం.. తాజ్మహల్ భద్రతపై దృష్టి సారించింది.
మరోసారి బాంబు బెదిరింపులు..
ఇదిలా ఉండగా.. తాజ్మహల్కు ఆదివారం మరో సారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్డీఎక్స్తో తాజ్ మహల్ను పేల్చేస్తామని కేరళ నుంచి అధికారులకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికా రులు, తాజ్మహల్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పోలీ సులు, బాంబు నిర్వీర్యం దళం, డాగ్ స్క్వాడ్, భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) అధికారులు, సీఐఎస్ఎఫ్ భద్రతా దళం మూడు గంటల పాటు తాజ్మహల్ ప్రాంగణంలో తనిఖీలు చేశారు. అనుమానాస్పద వస్తువులేవీ దొరకలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు. మెయిల్పై రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఫేక్ ఈమెయిల్ అని తేలడంతో దీనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.