అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు | Annamalai Remarks On Tamil Nadu Child Assault Case Spark Political Debate Over Migrant Worker Monitoring | Sakshi
Sakshi News home page

అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు

Jun 16 2026 4:53 PM | Updated on Jun 16 2026 5:49 PM

Annamalai seeks stricter monitoring of migrant workers from North India

సాక్షి,చెన్నై: తమిళనాడు తిరువల్లూర్ జిల్లా గుమ్మిడిపూండి అనే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అఫ్ తమిళనాడు (SIPCOT) ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో  మూడేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై చిన్నారి మరణం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

జూన్‌ 14న బిహార్‌ రాష్ట్రం బిబిన్‌ మంజికి చెందిన అభియోగి అనే 19ఏళ్ల వలస కార్మికుడు చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న పొదల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి అ‍త్యవసర చికిత్స నిమిత్తం గుమ్మిడిపూండి ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. జూన్ 15 ఉదయం బాలిక తీవ్ర గాయాలతో మరణించింది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. దారుణానికి ఒడిగట్టిన అభియోగిని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

విజయ్‌ ప్రభుత్వానికి డిమాండ్‌
ఆ ఘటనపై స్పందించిన అన్నామలై.. పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రశంసించారు. అయినప్పటికీ, ఇలాంటి నేరాలను ముందుగానే నివారించడంపై దృష్టి పెట్టాలి అని అన్నారు. ఉద్యోగాల కోసం వలస రావడం సహజమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికుల రికార్డులు సరైన విధంగా నిర్వహిస్తుందా, యజమానులు, కాంట్రాక్టర్లు వారి వివరాలను అధికారులకు అందిస్తున్నారా అని ప్రశ్నించారు. వలస కార్మికుల వివరాలు, వారి స్వస్థలం, పని చేసే ప్రదేశం, నివాసం, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు వంటి సమాచారం సేకరించి, ట్రాక్ చేసి, పర్యవేక్షించే విధంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

వాళ్లవల్లే దారుణాలు 
అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన దుర్ఘటనలను ఎక్స్‌ వేదికగా ఉదహరించారు. ‘ జూన్‌ నెల ప్రారంభంలో చెన్నైలో ఒక వృద్ధ మహిళ నుండి బంగారు గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించిన ఉత్తర భారత రాష్ట్రానికి చెందిన యువకుడు అరెస్టయ్యాడు. గత నెలలో, తాంబరం వద్ద యువతిపై లైంగిక వేధింపులు, తిరువల్లూరు సమీపంలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి, చెన్నై వెలాచేరి బస్ స్టాండ్ దగ్గర 61 ఏళ్ల మహిళపై సామూహిక హత్యాచారం, చెన్నై వెలాచేరిలో మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళపై లైంగిక వేధింపుల కేసులో 15 ఏళ్ల బాలుడితో పాటు ముగ్గురు ఉత్తర భారత కార్మికుల అరెస్టు, చెన్నై మదురవోయల్ ప్రాంతంలో తెల్లవారుజామున ఇంటి ముందు కోలమ్ వేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.ఈ సంఘటనల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువకులు అరెస్టు కావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది’ అని అన్నామలై పేర్కొన్నారు.  

 

తనదైన మార్క్‌ పాలిటిక్స్‌కు 
అన్నామలై తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాజీ బీజేపీ నేత ద్రావిడ సిద్ధాంతాలు, ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తనదైన మార్క్‌ పాలిటిక్స్‌కు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.

తమిళనాడు రాజకీయాలు తమిళ గుర్తింపు, భాష, ద్రావిడ సిద్ధాంతం, ప్రాంతీయం, ఉత్తర భారత వ్యతిరేక వాదనల చుట్టూ తిరుగుతున్నాయి. ఇదే సిద్ధాంతం ఆధారంగా ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు ఆరు దశాబ్దాలుగా శక్తివంతమైన రాజకీయాలే చేశాయి. ఇప్పుడు తమిళనాడు మాజీ  బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై ఇదే పంథాలో సరికొత్త రాజకీయానికి తెరతీశారు. ద్రావిడ పార్టీలను వారి విభజనాత్మక రాజకీయాలపై విమర్శిస్తూ, ఇప్పుడు ఉత్తర భారత వ్యతిరేక వాదనను కొత్త కోణంలో ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తున్నారు.

గుమ్మిడిపూండి ఘటనలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి,మరణంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఉత్తర భారత కార్మికుల నేరాలలో పెరుగుతున్న ప్రమేయం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. పోలీసుల వేగవంతమైన చర్యలను ప్రశంసించినప్పటికీ, నేరాలను ముందుగానే నివారించే విధానాలు అవసరమని సూచించారు. తద్వారా మిగిలిన ద్రావిడ పార్టీల తరహా ఉత్తర భారత వ్యతిరేక వాదనను భాష, సంస్కృతి, ప్రాంతీయం ఆధారంగా కాకుండా పాలన, భద్రత, వలస కార్మికుల నియంత్రణ అంశాలపై దృష్టి పెట్టి, కొత్త రాజకీయాలకు తెరతీశారని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement