ప్రిన్సిపల్‌ ఇంట్లో సింథటిక్‌ మిల్క్‌.. కేసు నమోదు

Retired Principal Sold Synthetic Milk At Madhya Pradesh - Sakshi

భోపాల్‌: ఫుడ్‌సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి నిర్వహించిన దాడులలో కల్తీ పాలు పట్టుబడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాదిహర్‌లో చోటు చేసుకుంది. 65 ఏళ్ల రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ దీన్‌దయాల్‌ శర్మ నివాసంలో గురువారం 200 లీటర్ల కల్తీ(సింథటిక్‌ మిల్క్‌) పాలను, పామాయిల్‌, ఇతర రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఆహార భద్రతా అధికారి అవినాష్‌ గుప్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సెక్షన్‌ 272(అమ్మడానికి పెట్టిన ఆహార పదార్ధాలను కల్తీ చేయడం), సెక్షన్‌ 273(విషపూరితమైన ఆహారాన్ని అమ్మడం), 420(చీటింగ్‌) పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. (చదవండిభయపెడుతున్న బురేవి)

ఎఫ్‌ఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. పోలీసులు దాడి చేయటానికి వెళ్లినప్పుడు ప్రిన్సిపల్‌ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని, 250 నుంచి 300 లీటర్ల వరకూ పాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్‌ అతని వద్ద లేదని తెలిపారు. ఈ దాడులలో పాలతో పాటు 10 కిలోల మాల్టోడెక్స్‌ట్రిన్‌ పౌడర్‌, పామాయిల్‌ స్వాధీనం చేసుకున్నామని వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. దీనదయాల్‌ శర్మ సింథటిక్‌ పాలను తయారు చేసి ప్రజలకు హానికలింగే పదార్థాలను విక్రయిస్తున్నారని ఎఫ్‌ఐర్‌లో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్‌ టీమ్‌ వెళ్లిందన్నారు. అయితే ఈలోపే అతను పరారయినట్లు, త్వరలోనే నిందితుడిని పట్టకుంటామని సిహోనియా పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.

ఇలా చేస్తారనుకోలేదు..
పదిహేనేళ్ల క్రితం ఖదియాహర్‌లోని గర్ల్స్‌ ఇంటర్‌ కాలేజీలో ప్రిన్సిపల్‌గా చేరారని అప్పుడు ఉత్తీర్ణత 17శాతం మాత్రమే ఉండేదని దీనదయాల్‌ చేరిన తరువాత 70 శాతం అయ్యిందని విద్యానాణ్యత మెరుగుపరచడానికి కృషి చేసిన ఆయన ఇలా చేశారంటే నమ్మబుద్ది కావడం లేదని మాజీ విద్యార్థి, ప్రస్తుత స్థానిక సామాజిక కార్యకర్త జయంత్‌ అంటున్నారు.  (చదవండి8న భారత్‌ బంద్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top