యూపీలో గొలుసుకట్టు వాహన ప్రమాదం... | 11 killed in Mirzapur road accident | Sakshi
Sakshi News home page

యూపీలో గొలుసుకట్టు వాహన ప్రమాదం...

Apr 24 2026 4:47 AM | Updated on Apr 24 2026 4:47 AM

11 killed in Mirzapur road accident

నలుగురు చిన్నారులు సహా 11 మంది మృతి

మిర్జాపూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గొలుసుకట్టు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన ఓ లారీ ముందు వెళ్తున్న రెండు కార్లను, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో ఒక కారులోని నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా 9 మంది సజీవ దహనమయ్యారు. 

బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 135వ నంబర్‌ జాతీయ రహదారిపై ద్రుమ్మొండ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బర్కామోడ్‌ సమీపంలో ఈ గొలుసుకట్టు ప్రమాదం చోటుచేసుకుంది. ద్రుమ్మొండ్‌గంజ్‌ నుంచి లసోదా వైపు సెనగల లోడుతో వేగంగా వస్తున్న లారీ ముందుగా వెళ్తున్న బొలెరోతోపాటు, మరో కారును, ఆపై ఆగి ఉన్న ట్రయిలర్‌ ట్రక్కును ఢీకొట్టింది. లారీ, ట్రక్కు మధ్య ఇరుక్కుపోయిన కార్లలో మంటలు చెలరేగాయి. బొలెరోలో ఉన్న నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం 9 మంది సజీవ దహనమయ్యారు. మరో కారు, ట్రక్కు, డ్రైవర్లు కూడా చనిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement