కోస్గి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి బస్సు డిపోకు మంజూరైన నాలుగు ఎలక్ట్రికల్ బస్సులను డీఎం రాజయ్యతో కలిసి కొడంగల్, కోస్గి బస్స్టేషన్లలో 2 బస్సుల చొప్పున ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ కోస్గి డిపోకు ఇప్పటి వరకు 29 బస్సులు మంజూరు కాగా.. ఇందులో ఎలక్ట్రికల్ 4, జనరల్ 25 ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు రాములు, పట్టణ అధ్యక్షులు తుడుం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, కౌన్సిలర్ భానునాయక్, కో ఆప్షన్ సభ్యుడు సలీం తదితరులు ఉన్నారు.
ఆధునిక వ్యవసాయ
పద్ధతులు పాటించాలి
కొత్తపల్లి: రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. మండలంలోని లింగాల్చేడ్ రైతువేదికలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్పీఎల్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం, నూనెగింజల పంటల ప్రోత్సాహం, చిరుధాన్యాల సాగు, సమగ్ర వ్యవసాయ విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే నానో ఎరువుల వినియోగం, ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో మండలంలోని ఎక్కామేడ్లో రైతు మల్లేశ్ పత్తి పంటలో వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ శాంతినిర్మల, ఏడీఏ రామకృష్ణ, ఏఓ రమేష్, ఏఈఓలు నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జిల నిర్మాణం కోసం సర్వే
ధన్వాడ: మండల కేంద్రంలోని కోటపక్క వీధిలో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన ప్రదేశాలను డీఈఈ ఉపేందర్రెడ్డి, ఏఈ తరుణ్రెడ్డి పరిశిలించారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.4 కోట్లు మంజూరు చేసిందని, పనులు త్వరలో ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్యగౌడ్, ఉపసర్పంచు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


