మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీను
నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 4న మద్దూరు మండల కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో బుధవారం సీఎం పర్యటన ఏర్పా ట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యటనలో ఎలాంటి లోటుపా ట్లు లే కుండా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, అక్కడి నుంచి కళాశాలకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. రహదారి మరమ్మతు, పారిశుద్ధ్య పనులు, పొదలు, చెత్త తొలగింపు వంటి పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. డిగ్రీ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన అనంతరం సీఎం సందర్శించనున్న తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణ ప్రాంతానికి వెళ్లే మార్గాలను కూడా సిద్ధం చేయాలన్నారు. ప్రధాన మార్గంతో పాటు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
పెండింగ్ పనులకు డెడ్లైన్
సీఎం సెక్యూరిటీ, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర భద్రతా బృందాలు జిల్లాకు చేరుకునే అవకాశం ఉన్నందున పెండింగ్ పనులన్నింటినీ గురువారం సాయంత్రం కల్లా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. భద్రతా అధికారులు, ఎస్ఎల్ బృందం సూచనల మేరకు రూట్, భద్రతా ఏర్పాట్లలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీఓ రమేష్, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, డీపీఆర్ఓ రషీద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


