‘ప్రజావాణి’
ఫిర్యాదులు పరిష్కరించాలి..
నారాయణపేట: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ ఉద్దేశం అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం కాదని.. అవసరమైన ఆధారాలతోవారి వివరాలను ధ్రువీకరించడమేనని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితా అనంతరం గుర్తించిన అనామలీస్, నాన్లింక్డ్ కేసులను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీలో అవసరమైన ఆధారాలతో హాజరయ్యేలా బీఎల్వోలు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆమోదించిన డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి ఓటరు సమర్పించినప్పుడు సంబంధిత పత్రాలను పరిశీలించి ఆనన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వివాహం, వలస, కుటుంబ వివరాల్లో మార్పులు, తల్లిదండ్రుల డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవడం వంటి ప్రత్యేక కేసులను నిబంధనల ప్రకారం విడివిడిగా పరిశీలించాలని సూచించారు. ఇప్పటికీ ఆన్లైన్లో లింక్ చేసుకునే అవకాశం ఉన్న నాన్ లింక్డ్ కేసులను సంబంధిత ఓటర్లకు తెలియజేసి వెంటనే ప్రక్రియ పూర్తి చేయించాలని ఆదేశించారు. క్లిష్టమైన కేసులను ప్రత్యేకంగా గుర్తించి ఉన్నతాధికారుల మార్గదర్శకాలు తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా ఓటరు జాబితా సవరణను పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎన్నికల విభాగం అధికారి జయసుధ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, మహ్మద్ సలీం, రాఘవ చౌదరి, రాములు, వెంకట్రామారెడ్డి, కెంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 5 ఫిర్యాదులు అందగా పరిష్కారం కోసం సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సిఫారస్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి అర్జీని బాధ్యతగా పరిశీలించాలని, పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


