నారాయణపేట: నూతన కార్యవర్గం పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఈ నెల 25న పోలీసు అధికారుల సంఘం సభ్యుల ఎంపిక పూర్తికాగా.. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సుధాకర్ (హెడ్ కానిస్టేబుల్), ఉపాధ్యక్షులుగా శివశంకర్ (పేట సీఐ), శివశంకర్ (ఆర్ఎస్ఐ), కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా మురళీకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా లక్ష్మీనారాయణ (హెడ్ కానిస్టేబుల్), ట్రెజరర్గా రాజు (కానిస్టేబుల్), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా శ్రీదేవి (హెడ్ కానిస్టేబుల్), యాదయ్య, పరంధాములు, శ్రీనివాసులు, రమేష్, మహేష్ (కానిస్టేబుల్స్) ఎన్నికయ్యారు. కార్యవర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాదకబాదకాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను సంఘం ప్రతినిధులు తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని తెలిపారు. సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా పోలీస్శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సిబ్బంది సంక్షేమం, ఐక్యత, సమన్వయం కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పోలీస్శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా లేదా చట్టవిరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సంఘం కార్యకలాపాలు పోలీస్శాఖ నిబంధనలు, చట్టపరమైన పరిధిలోనే కొనసాగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, డీఎస్పీ మహేష్, సీఐలు రాంలాల్, సైదులు, భగవంత్రెడ్డి, ఎస్బీ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


