● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
మక్తల్: గ్రామాల్లో భేధాభిప్రాయాలు ఏర్పడితే అభివృద్ధి కుంటుపడుతుందని.. సమష్టిగా కలిసి ముందుకు సాగితేనే పురోగతి సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని జౌళాపూర్ సర్పంచ్ మహదేవమ్మతో పాటు పలువురు వార్డుసభ్యులు బీజేపీ నుంచి కాంగ్రెస్పార్టీలో చేరగా.. నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించి శాలువాలతో సన్మానించి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రూ.276 కోట్లతో 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 68 వేల రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రతి పేదవాడికి 6 కిలోల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బ్యారేజ్ల నిర్మాణం ద్వారా జిల్లా సాగు, తాగునీటి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో మక్తల్–నారాయపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని.. రూ.100 కోట్లతో ముంపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామన్నారు. ఆత్మకూర్–గద్వాల నడుమ కృష్ణానదిపై వంతెన నిర్మాణంతో ఆ ప్రాంత రూపురేఖలు మా రుతున్నాయని వివరించారు. పదవులు శాశ్వతం కాదని.. అభివృద్ధి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేందర్గౌడ్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, పాల కృష్ణ పాల్గొన్నారు.


