నారాయణపేట: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఆదివారం పుర పరిధిలోని 8వ వార్డు సత్యసాయికాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రహదారులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కాలనీల్లో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని, వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ఓబీసీ మోర్చా నాయకులు రఘురామయ్య, వైస్ చైర్మన్ మంజుల జీఆర్రెడ్డి, కార్పొరేటర్ కిరణ్కుమార్రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణ, గోపాల్యాదవ్, సీనియర్ నాయకులు ఉదయభాను, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరోగ్యకర జీవనశైలిని
అలవర్చుకోవాలి : ఎస్పీ
నారాయణపేట: జిల్లా యువత, విద్యార్థులు క్రీడలు, ఫిట్నెస్ వైపు దృష్టి సారించాలని.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్లో ఆయనతో పాటు డీసీఆర్బీ డీఎస్పీ మహేష్ పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ విధుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం ఎంతో కీలకమని తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని.. సీఐలు, ఎస్ఐలు, సిబ్బందికి లాంగ్ రన్నింగ్, సైక్లింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కొంత సమయం వ్యాయామం, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, ధ్యానం కోసం కేటాయించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే రోజువారీ పనులను మరింత ఉత్సాహంతో సమర్థవంతంగా నిర్వహించగలమన్నారు.


