నారాయణపేట: పీఎండీడీకేవై కార్యక్రమం కింద నమోదవుతున్న డేటాను సమగ్రంగా పరిశీలించి జిల్లాకు మెరుగైన ర్యాంకింగ్ సాధించేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. పీఎండీడీకేవై పోర్టల్లో డేటా నమోదులో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని.. కేవలం డేటా నమోదుకే పరిమితం కాకుండా జిల్లాలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సరైన సూచిక కింద నమోదు చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యాన, మత్స్య, సహకార, భూగర్భజల తదితర శాఖలు రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలను సంయుక్తంగా అమలు చేస్తున్నందున ఆయా కార్యక్రమాల్లో తమ శాఖ పాత్రను గుర్తించి సంబంధిత సూచికల్లో నమోదు చేయాలన్నారు. సహజ వ్యవసాయం, విత్తనాల పంపిణీ, ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతు వేదికల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, నీటి సంరక్షణ, పాంపాండ్లు, ఇతర జల సంరక్షణ కార్యక్రమాలను కూడా సంబంధిత సూచికల కింద నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కంటే జిల్లాలో అధికంగా సాధించే అవకాశం ఉంటే.. అదనపు టార్గెట్ కోసం ప్రతిపాదనలు పంపాలని, పీఎం డీడీకేవై పోర్టల్లో నమోదైన టార్గెట్ లేదా అచీవ్మెంట్లో తప్పులుంటే ప్రశ్నల వారీగా వాటిని గుర్తించి సవరణకు అవసరమైన వివరాలను సమర్పించాలని సూచించారు. 2026–27 సంవత్సరంలో జిల్లాకు మెరుగైన ఫలితాలతో పాటు ఉన్నత ర్యాంకింగ్ సాధించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్డీఓ వెంకట్రాములు, వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్, సీపీఓ ఖాగవాహన్, హౌసింగ్ పీడీ శంకర్నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


