కోస్గి: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించి ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్, కళాశాల కార్యదర్శి అనిల్కుమార్ కోరారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీచౌరస్తాలో మహబూబ్నగర్–తాండూర్ ప్రధాన రహదారిపై కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణవైపు వెళ్లడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీ ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉందని.. పాలిటెక్నిక్ విద్యపై స్పష్టత ఇవ్వడంతో పాటు జీఓనంబరు 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలలో అవసరమైన ల్యాబ్లు, హాస్టళ్లు, పరికరాలు, బోధన సిబ్బందిని నియమించాలని, ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు. విద్యార్థి సంఘాలు, అధ్యాపకులతో చర్చించిన తర్వాతే విద్యా విధానంపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.


