మక్తల్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం మండల కేంద్రంలోని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి క్యాంపు కార్యాలయాన్ని పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రూ.10 వేల కోట్లకుపైగా ఉన్న ఉపకార వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర నాయకులు సాయికుమార్, మహేష్, బాలకృష్ణ, రాజు, అజయ్, శివ, వైష్ణవి, వెంకటేష్, శ్రావణి, పవిత్ర, రేవతి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


