నారాయణపేట: మండల ప్రత్యేక అధికారులు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్లో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్షించారు. కొడంగల్ నియోజకవర్గంలోని మండలాల్లో నెలకొన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని, పీహెచ్సీలు, ఎంపీపీఎస్ పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. డ్రై డే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేజీబీవీల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు. ఊట్కూరు, నారాయణపేట మండలాల అవసరాలపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నేడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
జిల్లాకేంద్రంలోని గాయత్రి ఫంక్షనన్హాల్లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారని.. లబ్ధిదారులకు ముందస్తు సమాచారం అందించి పెద్దసంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


