బోగస్ రేషన్ కార్డులకు చెక్ పెట్టేందుకే..
నర్వ: బోగస్ రేషన్కార్డుల ఏరివేతతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండున్నర ఏళ్ల కిందట ఈ–కేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ ప్రారంభంలో వేగంగా కొనసాగినా.. కొన్నాళ్ల తర్వాత అధికారులపై ఒత్తిడి పెరగడంతో మందగించింది. దీంతో చాలామంది లబ్ధిదారుల ఈ–కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో 1,71,778 రేషన్ కార్డులుండగా.. ఇప్పటి వరకు 74.22 శాతం మాత్రమే పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితేనే మరిన్ని బోగస్ కార్డులు, మరణించిన వారి సంఖ్య తేలనుంది. ఆహార భద్రతకార్డులోని సభ్యులందరూ రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 31వ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది.
కొనసాగుతున్న ప్రక్రియ..
జిల్లావ్యాప్తంగా రేషన్ డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పటి వరకు చౌకధర దుకాణాల్లో ఉన్న పాత ఈ–పాస్ యంత్రాల్లో వేలిముద్రలు, ఐరిష్ సరిగా నమోదు కాకపోవడంతో లబ్ధిదారులు రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4జీ సదుపాయంతో కొత్త యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని 323 మంది డీలర్లకు గతంలోనే ఈ యంత్రాలను అధికారులు అందజేశారు. వై–ఫై, బ్లూటూత్ అందుబాటులో ఉండే ఈ యంత్రాల్లో ఐరిష్, వేలిముద్రలు క్షణాల్లో క్యాప్చర్ కావడంతో లబ్ధిదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా రేషన్ సరుకులు అందుతున్నాయి.
కృష్ణాలో అతి తక్కువగా..
జిల్లాలోని కృష్ణా మండలంలో ఇప్పటి వరకు 71 శాతమే ఈ–కేవైసీ పూర్తయింది. కోస్గి, మాగనూర్, మక్తల్, నారాయణపేటలో 73 శాతం పూర్తయినందున అధికారులు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
త్వరలో స్మార్ట్ కార్డులు..
రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆగస్టులో వీటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. కార్డ్పై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు కనిపించేలా రూపొందించారు.
నెలాఖరుకు
ముగియనున్న గడువు
అతి తక్కువగా
కృష్ణా మండలంలో
71 శాతం
త్వరలోనే స్మార్ట్కార్డుల
పంపిణీ.. సిద్ధం చేస్తున్న అధికారులు


