భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారం
దామరగిద్ద: మక్తల్–పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. మంగళవారం మండలంలోని కాన్కుర్తి, గడిమున్కన్నల్లి, మల్రెడ్డిపల్లి గ్రామాల్లో పునరావాస– పునరాశ్రయం పేరుతో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కోర్టు కేసులు ఉన్న భూములను రైతులు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ చట్టబద్ధం కాదన్నారు. కోర్టు క్లియరెన్స్ తర్వాతే భూములు సేకరించి.. రైతులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకంలో వ్యవసాయ భూములను పాక్షికంగా లేదా పూర్తిగా కోల్పోయినా, ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బోర్లు, బావులు ఇతర ఎలాంటి నిర్మాణాలు ఉన్నా పరిహారం కోసం వారం రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మానంద, తహసీల్దార్ తిరుపతయ్య, ఆర్ఐ బాల్రాజ్, కాన్కుర్తి సర్పంచ్ నారాయణ తదితరులు ఉన్నారు.


