నిర్దేశిత లక్ష్యాలు సాధిద్దాం
నారాయణపేట: నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గతేడాది మంజూరైన ఇళ్లు పూర్తయితేనే వచ్చే సంవత్సరానికి మళ్లీ టార్గెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 13 మండలాలకు ఐదుగురు మాత్రమే హౌసింగ్ ఏఈలు ఉండేవారని.. ప్రస్తుతం మరికొందరు ఏఈలు జిల్లాకు వచ్చి విధుల్లో చేరారన్నారు. పంచాయతీ కార్యదర్శులతో ఏఈలు సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 100 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. వేసవి సమీపిస్తున్నందున ఉపాధి హామీ పథకం లక్ష్య సాధనకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలాల వారీగా పనుల వివరాలపై డీఆర్డీఓ మొగులప్పతో సమీక్షించారు. అదే విధంగా ఉల్లాస్ పథకం అమలు తీరును డీఈఓ గోవిందరాజులుతో తెలుసుకున్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ఉన్నారు.
● మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ. 20లక్షల నష్టపరిహారం ఇస్తోందన్నారు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అందించిన పరిహారం తదితర విషయాలపై తహసీల్దార్లతో కలెక్టర్ చర్చించారు. మిగిలిన భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేసేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ ఉన్నారు.
● జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న నిర్వహించే ర్యాలీలో అధికారులు, ఓటర్లు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆమె మాట్లాడుతూ.. ఓటర్లను చైతన్యం కలిగించడమే ఓటరు దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నా రు. 25న ఆదివారం సెలవుదినం అయినందున 23న అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులతో సామూహి క ప్రతిజ్ఞ చేయించాలని ఆదేశించారు. 25న మై ఇండియా – మై ఓటు నినాదంతో నిర్వహించే ర్యాలీలో అన్ని ప్రభుత్వశాఖలు పాల్గొనాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లోవేగం పెంచాలి
ఉపాధి హామీ కూలీలకు
వంద రోజుల పని కల్పించాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్


