క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన టోర్నీలో బాలుర విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, పెద్దపల్లి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. మహబూబ్నగర్ తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ మొదటి, మహబూబ్నగర్ ద్వితీయ, నల్లగొండ తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు ఓబేదుల్లా కొత్వాల్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహపడొద్దని.. మరోసారి గెలిచేందుకు పట్టుదలతో ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు విలియమ్స్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింహులు, తఖి, సర్ఫరాజ్ హుస్సేన్ అన్సారి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి పీడీలు నర్సింహులు, రత్నయ్య బాలరాజు, సాయినాథ్, నర్సింహారెడ్డి, రవికుమార్, వెంకటేశ్, రాజశేఖర్, మౌలాలి, వేణుగోపాల్, పర్విన్, తిరుమలేష్, గణేశ్, చక్రవర్తి, హారికాదేవి పాల్గొన్నారు.


