
‘ప్రజావాణి’ ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులతో అప్రమత్తం
మద్దూరు: కొన్ని రోజులుగా కుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, సిబ్బంది ఆస్పత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మద్దూరులోని సీహెచ్సీ, బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశానే. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉండే మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. చిన్న పిల్లల వార్డును పరిశీలించి వైద్య నిఫుణుడు క్రాంతికిరణ్తో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 30 బెడ్లు సరిపోవడం లేదని, బెడ్ల సంఖ్యను పెంచాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పక్కనే ఉన్న పీహెచ్సీలో 5 బెడ్లను వినియోగించుకోవాలని సూచించారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు ఆదేశించారు. మెస్ కమిటీ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. రోజూ అందించే భోజనం, అల్పాహారం నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్గౌడ్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ తక్షణ స్పందన..వృద్ధురాలికి స్వాంతన
నారాయణపేట: ‘కొడుకు, కోడలు ఉన్నా.. నిరాధరణకు గురై నడవలేని స్థితిలో ఉన్న పట్టణానికి చెందిన వృద్ధురాలు రుక్మిణి తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్కు రావడంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ తక్షణం స్పందించారు. కలెక్టరేట్ మెట్లు ఎక్కడానికి తన కుమార్తెల సహాయంతో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి వద్దకే కలెక్టర్ వెళ్లి విషయంపై ఆరా తీశారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆయన ఉద్యోగం పొందిన కొడుకు తనకు తిండి పెట్టడం లేదని, కోడలు సైతం వేధింపులకు దిగుతోందని వృద్ధురాలు వాపోయింది. స్పందించిన కలెక్టర్ వృద్ధురాలికి వీల్చైర్ తెప్పించారు. అనంతరం ఆమెకు సఖీ కేంద్రంలో ఆశ్రయం కల్పించాలని సూచించడంతో పాటు విచారణ చేసి కొడుకుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ రాంచందర్ను ఆదేశించారు.