
అవినీతికి అడ్డా!
డీఎంహెచ్ఓ కార్యాలయంలో అవినీతి తిమింగలాలు
నారాయణపేట: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయకుండా.. కలెక్టర్ అనుమతులు లేకుండా పలు పోస్టింగులు ఇవ్వడంతో అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఇటు ఉద్యోగం పొందిన వారిని అయోమయంలో పడేసినట్లయింది. దీనిపై సమగ్ర విచార చేపట్టాలంటూ ఎంపీతో పాటు కలెక్టర్కు కొందరు ఫిర్యాదు చేయగా.. తాజాగా విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
బయట పడిందిలా..
వివిధ స్థాయిలో ఉద్యోగాల్లో నియామకాలు జరిపిన వారికి జీతాలు చెల్లించాలంటే వారికి ఐడీ నంబర్లు ఉండాలి. అయితే వారికి ఐడీ నంబర్లు కేటాయించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి హైదరాబాద్లోని కమిషనరేట్కు వెళ్లారు. మా కమిషనరేట్ నుంచి ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని ఆర్డర్ ఏమైనా ఇచ్చామా, లేక కలెక్టర్ అప్రూవల్తో ఉద్యోగులను నియమించుకున్నారా అని వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా అక్రమంగా నియామకం చేపట్టిన వారికి ఐడీ నంబర్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ అధికారిని తిప్పి పంపించడంతో ఈ తతంగం బయటపడినట్లు సమాచారం.
విచారణ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం
డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇటీవల కలెక్టర్ సిక్తాపట్నాయక్కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని ఓ ఉద్యోగిని, జిల్లా అడిషనల్ కలెక్టర్లతో విచారణ జరిపించినట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న ఆంశాలతో పాటు మరిన్ని విషయాలు అధికారుల విచారణలో తెలినట్లు తెలుస్తోంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవి నీతి, అక్రమాల పుట్టాను తయారు చేసి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులకు నివేదించినట్లు సమాచారం.
అవినీతి ఆరోపణలు ఇవీ..
జిల్లా మలేరియా అధికారిగా పనిచేస్తున్న ఓ అధికారి సతీమణిని ఆర్బీఎస్కే కింద ఫార్మసిస్టుగా నియమించారు. ఈమె ఆర్బీఎస్కే ‘ఎ’ టీంలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
తిప్రాస్పల్లికి చెందిన ఓ యువకుడు ఫార్మాసిస్టుగా ఆర్బీఎస్కే కోస్గి టీంలో పనిచేస్తున్నారు. (ఉద్యోగులకు ఐడీ నంబర్లు ఇవ్వమని తెలపడంతో ఈయనకు ఇచ్చిన ఆర్డర్ కాపీని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.)
జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఊట్కూరుకు చెందిన బీహెచ్ఎంఎస్ చేసిన ఓ వైద్యుడికి ఎంఎల్హెచ్పీగా తీసుకోవాల్సిందిగా రెఫర్ చేస్తూ లెటర్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అదే లెటర్లో.. 104లో డాటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న డీఈఓ పేరును సైతం జోడించి జిల్లా కమ్యూనిటీ మోబిలైజర్(డీసీఎం)గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓ మహిళను ఎన్హెచ్ఎం కింద 2024 డిసెంబర్లో స్టాఫ్నర్స్గా నియమించడంతో మరికల్ పీహెచ్సీలో పనిచేస్తున్నారు.
మరో వ్యక్తిని అక్టోబర్ 2024లో కృష్ణా పీహెచ్సీకి ఆయుష్ ఫార్మాసిస్టుగా నియమించారు. కానీ అతను ఫార్మసిస్టే కాదు.
ఓ యువకుడు కోటకొండ పీహెచ్సీ, మరో యువతి కోస్గిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఆయా నియామకాలను చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఊట్కూరు పీహెచ్సీలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న మహిళ వైద్య పరీక్షల నిమిత్తం రెండు నెలలు సెలవులో ఉన్నా వేతనం మాత్రం డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె భర్త కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్ అనే సాకుతోనే రెండు నెలల జీతాన్ని చెల్లించినట్లు సమాచారం.
నోటిఫికేషన్లు లేకుండానే పోస్టింగ్లు
కలెక్టర్ అనుమతులు సైతం లేని వైనం
ఉద్యోగాలు పొందిన వారికి ఐడీలు ఇవ్వకపోవడంతో అయోమయం
విచారణ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం

అవినీతికి అడ్డా!