● జూపాడుబంగ్లా వద్ద కేసీ కాల్వలో దిగి రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన
జూపాడుబంగ్లా: వెంటనే కర్నూలు–కడప కాల్వకు సాగునీటినిచ్చి రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అన్నారు. జూపాడుబంగ్లా సమీపంలోని కేసీ కాల్వ క్రాస్రెగ్యులేటర్ వద్ద కాల్వలోకి దిగి రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం నిరసన తెలిపారు. ‘రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి నశించాలి..నశించాలి, కేసీ కాల్వకు సాగునీటి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మౌనం వీడాలి’ అని నినాదాలు చేశారు. శ్రీశైలం డ్యాం నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన రైతులకు సాగునీరివ్వకుండా కాలక్షేపం చేయటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. శ్రీశైలం డ్యాంలో 872 అడుగుల నీటిమట్టం ఉన్నా కేసీ కాల్వకు సాగునీరివ్వకపోవటంతో ఖరీఫ్లో సాగుచేసిన పంటలను దున్నేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40వేల పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న కళ్లెదుట ఎండిపోతుండటంతో చూడలేక దున్నేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయం నీటిని హంద్రీ–నీవా కాల్వ ద్వారా అనంతపురానికి తరలిస్తుండగా కేసీ కాల్వ రైతులకు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేసీ కాల్వకు సాగునీటి సరఫరా విషయమై ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య మౌనం వీడాలన్నారు. జూపాడుబంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల పంటనష్టపరిహారం ప్రకటించాలన్నారు. రబీసీజన్కు అవసరమైన విత్తనాలను ఉచితంగా రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి వై.వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసిక తిరుమలేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి నాగార్జునరెడ్డి, మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి, తరుణ్కుమార్రెడ్డి, చిన్నమల్లయ్య, జంగాలసుంకన్న, లక్ష్మన్నగౌడు, నరసింహయాదవ్, రామకృష్ణ, సురేష్, హరికృష్ణ, ఆనంద్, హుసేన్, గోపాల్రెడ్డి, శివకుమార్రెడ్డి, వెంకటరమణ, లింగన్న, రంగస్వామిగౌడు, పబ్బతివెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


