బనగానపల్లె రూరల్: భక్తులు హుండీల్లో ఏప్రిల్ 1 నుంచి జూలై 24వ తేదీ వరకు వేసిన కానుల లెక్కింపు ద్వారా శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.34,65,512 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. నగదుతో పాటు 49 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కేజీ 40 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చాయన్నారు. కానుల లెక్కింపులో పర్యవేక్షణ అధికారిగా గ్రూపు ఆలయ ఈఓ జనార్దన్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): జవహర్ నవోదయ విద్యాలయం బనవాసిలో 6వ తరగతి ప్రవేశాలకు 2027–28 విద్యాసంవత్సరానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా ఆన్లైన్ చేసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులై ఉండాలన్నారు. 3, 4 తరగతులను ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలోనే చదివి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 2026–27 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలన్నారు. విద్యార్థులు 01–05–2015 నుంచి 31–07–2017 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఆన్లైన్ చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ గడువు ఉందని, ఎంపిక పరీక్ష నవంబర్ 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గృహ నిర్బంధాలు..
అక్రమ అరెస్టులు!
● నంద్యాల జిల్లాలో
విద్యాసంస్థల బంద్
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేసినా, అక్రమ అరెస్టులు చేసినా శుక్రవారం జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యింది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద బంద్ నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్, పీడీఎస్యూ కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి నిరంజన్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివకుమార్, సురేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకుల మాట్లాడుతూ.. 2014 నుంచి దేశవ్యాప్తంగా 152 పరీక్ష పేపర్లు లీకయ్యారన్నారు. నీట్ పేపర్ లీకెజీ కారణంగా దేశవ్యాప్తంగా 22మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈనెల 20న ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని సీపీఎంఎల్ పార్టీ కార్యదర్శి శంకర్ అన్నారు.


