కర్నూలు(సెంట్రల్): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్న అంత్యోదయ కార్డులకు ఇచ్చే బియ్యాన్ని 35 కేజీల నుంచి 15 కేజీలకు కుదించే యోచనను విరమించుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమైన నరేంద్రమోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం సుందరయ్య సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంత్యోదయ కార్డులకు 35 కేజీల నుంచి 15 కేజీలకు బియ్యాన్ని తగ్గిస్తే ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచినట్లు అవుతుందన్నారు. గతంలో యూపీఏ హయాంలో అప్పటి ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తే కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాలతో వెనక్కి తగ్గాయన్నారు. ఈ క్రమంలో పేదల తరఫున మరోసారి కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలకు దిగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కోశాధికారి ఆంజనేయులు, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న పాల్గొన్నారు.


