● తేదీ, స్థలం ఎక్కడో మంత్రి బీసీనే
నిర్ణయించాలి
● మంత్రి బీసీ సవాల్ను స్వీకరించిన
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె: నియోజకవర్గంలో మంత్రి బీసీ రెండేళ్ల పాలనతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అవినీతిపై తాను చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పష్టం చేశారు. చర్చ జరిగే స్థలం, తేదీని మంత్రినే పోలీసులతో చర్చించి ప్రకటించాలన్నారు. ఆదివారం పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి బీసీ శనివారం విలేకరుల సమావేశంలో విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 9న బనగానపల్లెలో రైతు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ‘నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్లో వాయిస్ బాగా వినిపిస్తుందని, మంత్రిగా నీవు ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. మీ పని తీరు బాగా మెరుగు పరచుకోవాలని’ బీసీ ఉద్దేశించిన విషయాన్నే తాను ప్రస్తావిస్తే మంత్రి ఉలికి పడటం ఎంత వరకు సమంజసమన్నారు. సీఎం మాటలతో ఫ్రస్టేషన్కు గురైన మంత్రి తనపై నోరు పారేసుకోవడం అవివేకమన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వంలో మొదటి పేజీ మాత్రమే మార్పు చేసి అదే బుక్ను చంద్రబాబు పంపిణీ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కమీషన్ల బీసీ..
బనగానపల్లె నియోజకవర్గంలో ప్రతి పనికి కమీషన్లు ఇచ్చుకోవాల్సిందేనని, కమీషన్ల మంత్రిగా బీసీ గుర్తింపు పొందారని కాటసాని రామిరెడ్డి విమర్శించారు. బనగానపల్లె మండల కేంద్రంలో రూ.22 కోట్లతో వందపడకల ఆసుపత్రిని నిర్మించి అక్కడ అప్పటి సీఎంగా జగన్మోహన్రెడ్డి, అప్పటి ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి ఫొటోలు తొలగించడం సరైనదేనా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మాత్రం అరకొర రోడ్లు వేసి పది అడుగుల ఎత్తైన శిలాఫలకాలు వేయించుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశించారు. వైఎస్సార్సీపీ నాయకుల గురించి మాట్లాడే మంత్రి ముందుగా టీడీపీ సీనియర్ నాయకులు బెలుం వెంకటసుబ్బారెడ్డి, కోడి నాగరాజు, పీఎల్ఎన్ కుమార్లకు ఎలాంటి న్యాయం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. చివరకు పీఎల్ఎన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు మంత్రి పేరు మీద ఉత్తరం రాసిన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో రాష్ట్ర నాయకుడుగా ఉన్న అత్తార్జాహెద్ హుస్సేన్ గతంలో టీడీపీలో ఎంతో సేవ చేసినా ఆయనకు జరిగిన అన్యాయంతో తమ పార్టీలో చేరారన్నారు. పట్టణంలోని జీఎం టాకీసు నుంచి కొత్తబస్టాండ్ వరకు డబుల్ రోడ్డు వేసి సెంటర్ లైటింగ్తో పాటు విద్యుత్ స్తంభాలకు జాతీయ జెండా రంగుల్లో వేసిన ఎల్ఈడీ బల్బులు నేడు లేవన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు అత్తార్ జాహెద్ హుస్సేన్, సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి, అంబటి రవికుమార్రెడ్డి అబ్దుల్ఫైజ్, సత్యంరెడ్డి మురళీ మోహన్రెడ్డి, ఖానిక్, కలాం, మారం ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


