● జిల్లా ఎన్నికల అధికారి,
జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: అర్హత కలిగిన ఓటరు తన ఎన్యుమరేషన్ ఫారమ్ను తప్పనిసరిగా ఈనెల 14లోగా సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. జూలై 14తో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగియనున్నందున ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. శనివారం వీడియో సందేశం ద్వారా జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం 14,05,443 మంది ఓటర్లు నమోదై ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,90,722 ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్ల నుంచి తిరిగి అందగా వాటిని విజయవంతంగా డిజిటలైజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో మరణించిన వారు, డూప్లికేట్ నమోదులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి, అలాంటి 55,449 ఫారాలను కూడా డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా 2,59,272 ఎన్యూమరేషన్ ఫారంలు ఓటర్ల నుంచి అందాల్సి ఉందన్నారు. మిగిలిన ఫారమ్ల సేకరణను వేగవంతం చేసేందుకు శనివారం, ఆదివారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. జూలై 14 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటరు బాధ్యతగా స్పందించి తమ ఎన్యూమరేషన్ ఫారమ్ను వెంటనే సంబంధిత బూత్ లెవెల్ అధికారికి అందజేయాలన్నారు.


