● ముగ్గురు వైద్యవిద్యార్థులకు గోల్డ్మెడల్స్
● ముగ్గురూ యూనివర్సిటీ టాపర్లే
కర్నూలు(హాస్పిటల్): సూపర్ స్పెషాలిటీ కోర్సులను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇటీవల వార్షిక పరీక్షలు నిర్వహించింది. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థులు యూనివర్సిటీ టాపర్లుగా రాణించడంతో పాటు మంచి పర్సెంటైల్స్తో గోల్డ్మెడల్స్ను సాధించారు. ఈ పరీక్షలకు కళాశాల నుంచి 11 మంది హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, వైద్యులు అభినందించారు.
కార్డియాలజీలో..
కార్డియాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ సనాఖాన్ పర్వేజ్ నవాజ్ యూనివర్శిటి టాపర్గా నిలిచారు. దీంతో పాటు ఆయన 75 పర్సెంటేజ్తో గోల్డ్మెడల్ సాధించారు. ఈయన తండ్రి సనాహా హుసేన్ అహ్మద్ ఆదోనిలోని అవ్వ బ్యాంకులో మేనేజర్. తల్లి మెహజబీన్ గృహిణి. అన్నయ్య ఇంజనీర్గా, చెల్లెలు టీచర్గా పనిచేస్తున్నారు. సనాఖాన్ పర్వేజ్ నవాజ్ భార్య రాహత్ షేక్ కూడా కంటి వైద్యులుగా రాణిస్తున్నారు.
నెఫ్రాలజీ విభాగంలో...
నెఫ్రాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ నేహా శర్మ యూనివర్శిటి టాపర్గా నిలిచారు. దీంతో పాటు 76 శాతం పర్సెంటేల్తో గోల్డ్మెడల్ సాధించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కాంగ్ర జిల్లాకు చెందిన ఈమె 2022 బ్యాచ్లో డీఎం నెఫ్రాలజి సీటు రావడంతో కర్నూలు మెడికల్ కాలేజిలో చేరారు. ఈమె తండ్రి శివకుమార్ శర్మ అగ్నికల్చర్ జేడీగా పనిచేశారు. తల్లి రమాశర్మ పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నారు. భర్త డాక్టర్ తుకారామ్ గోవాలో కార్డియాలజిస్టు.
యురాలజీ విభాగంలో..
యురాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ కటారు ప్రశాంత్బాబు యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. అంతేగాక మంచి పర్సంటైల్తో ఆయన గోల్డ్మెడల్ సాధించారు. నంద్యాలకు చెందిన ఈయన కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను పూర్తి చేశారు. 2022లో యురాలజీ సీటు కూడా ఇక్కడే రావడంతో యురాలజీ విభాగంలో చేరి రాణించారు. ఆయన తండ్రి కె.బాలుదాసు పోలీస్ కంట్రోల్ రూమ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. తల్లి కె.ప్రేమకుమారి గృహిణి.
డాక్టర్ కటారు ప్రశాంత్బాబు
డాక్టర్
నేహా శర్మ
సనాహా ఖాన్ నవాజ్


