రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు
మిర్యాలగూడ : విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద గల శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్లో తనిఖీలు నిర్వహించారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి రూ.80 లక్షల విలువైన కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం పక్కదారిపట్టినట్టు తనిఖీల్లో తేలిందని సమాచారం. విజిలెన్స్ అధికారులు రైస్మిల్లులోని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను పూర్తిచేయాలి
మర్రిగూడ : పశువుల్లో కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను సమయానుకూలంగా పూర్తి చేయాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి బి.వి.రమేష్ పశువైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన మర్రిగూడ ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆస్పత్రిలోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. మూగజీవాలకు అందుబాటులో ఉన్న మందుల వివరాలను, వ్యాధినిరోధక టీకాల నిల్వలను పశువైద్యాధికారి సురేందర్ను అడిగి తెలుసుకున్నారు. పశువులకు గాలికుంటు వంటి వ్యాధులు ప్రబలకుండా రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం దామెరభీమనపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారాన్ని పరిశీలించారు. ఆ తర్వాత శివన్నగూడెం, వెంకేపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రాలలో తనిఖీలు చేశారు. ఆయన వెంట పశువైద్యాధికారి పి.సురేందర్, పశువైద్య సిబ్బంది ఎ.మల్లేష్, శ్రీకాంత్, శివ తదితరులు ఉన్నారు.
కనగల్ : మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శ్రావణమాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ విగ్రహాల వద్ద జరిగిన కుంకుమార్చన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ ఇష్టదైవమైన అమ్మవారికి చీర, సారె, ఒడిబియ్యం, బోనం నైవేద్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.


