మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలోని నాగుల చెరువు శిఖం భూమి కబ్జా ఆక్రమణలపై లోకాయుక్త ప్రత్యేక బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో విచారణ, సర్వే చేపట్టింది. సమాచార హక్కు సంరక్షణ చట్టం కమిటీ ప్రతినిధి, ఫిర్యాదుదారు ధీరావత్ శ్రీనునాయక్ చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఇన్వెస్టెంగ్ ఆఫీసర్ ఇస్మాయిల్, నల్లగొండ డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) వెంకటేశ్ప్రసాద్, జిల్లా ఏడీ సర్వేయర్ దేవరాజ్ విచారణ చేపట్టారు. సర్వే నంబర్ 1152లో ఉన్న నాగులచెరువు శిఖం భూమి పూర్తి సేత్వార్ విస్తీర్ణం 95.27ఎకరాలు కాగా ప్రస్తుతం చెరువు కట్టతో కలిపి కేవలం 66.34ఎకరాలు మాత్రమే ఉందని, సుమారు 30.13 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని మాయమైందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మిషన్ కాకతీయ రెండవ విడత కింద 2016లో సుమారు రూ.50లక్షలతో 95.27ఎకరాల పూర్తి విస్తీర్ణానికి అభివృద్ధి పనులు చేపట్టినట్లు నీటి పారుదల శాఖ రికార్డులు తెలుపుతున్నప్పటికీ తరువాత వచ్చిన నివేదికల్లో 30.13 ఎకరాల భూమి ప్రస్తావన లేకపోవడాన్ని గుర్తించారు. 95.27ఎకరాల పూర్తి విస్తీర్ణాన్ని స్పష్టంగా గుర్తిస్తూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై పూర్తి సమాచారంతో కూడిన సమగ్ర నివేదికలను ఆగస్టు 16లోగా సమర్పించాలని లోకాయుక్త ప్రత్యేక బృందం నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీశైలం, తహసీల్దార్ జవహర్లాల్, ఆర్ఐ సుందర్సింగ్, సర్వేయర్ శోభన్, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
నిడమనూరులో విజిలెన్స్ బృందం..
నిడమనూరు : నిడమనూరు మండలంలోని ప్రభుత్వభూములు, గుట్టల తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీంచారు. వెనిగండ్ల సర్వే నంబర్ 99లో, నిడమనూరు సర్వే నంబర్ 291, 292, ఊట్కూరు సర్వే నంబర్ 442లో తవ్వకాలు పరిశీలించి, ఫొటోలు తీసుకొన్నారు. ఎంత విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారని సర్వేయర్ను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సర్వేయర్ గాయత్రి, ఆర్ఐ సైదులు, జీపీఓ సైదులు ఉన్నారు.


